‘పద్నాలుగేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో నిర్మాతగా అబద్దపు వసూళ్లను నేను ఏ రోజు చెప్పలేదు. ‘పాగల్’ చిత్రం మేము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. నిర్మాతగా చక్కటి సంతృప్తినిచ్చింది’ అని అన్నారు బెక్కం వేణుగోపాల్. మంగళవారం హైదరాబాద్లో ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కు లాభాల్ని తెచ్చిపెట్టినప్పుడే ఓ సినిమా సూపర్హిట్ అయినట్లుగా నేను భావిస్తా. ‘పాగల్’ ఆ కోవకు చెందిన సినిమా. ఈ సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకం వందశాతం నిజమైంది. వసూళ్లపరంగా సినిమాపై వస్తోన్న విమర్శల్లో నిజం లేదు. ఓవరాల్గా పన్నెండు కోట్ల గ్రాస్వచ్చింది. రెండు రోజుల్లోనే మేము లాభాల బాటపట్టాం. ఈ నెల 3న అమెజాన్ ప్రైమ్లో సినిమాను విడుదలచేస్తున్నాం. కరోనా భయాల వల్ల మధ్యతరగతి, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్కు రావడం లేదు. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే వసూళ్ల పరంగా పెద్ద నంబర్స్ కనిపించవు. థియేటర్స్కు పూర్వ వైభవం రాదు. వ్యాపార దృష్ట్యా ఓటీటీ లాభదాయకమే అయినా థియేటర్స్ ఇచ్చే సంతృప్తిని అవి అందించలేవు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఓ పోలీస్ బయోపిక్తో సినిమాను నిర్మిస్తున్నా. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’ అని తెలిపారు.