న్యూఢిల్లీ: ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కోసం కేంద్రం ఆకర్షణీయమైన వాలంటరీ రిటైలర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను తీసుకురానున్నదని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా సంస్థను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అంటే వారిపై అదనపు భారం తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు వినికిడి. ఇందుకోసం ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్ తేనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా తీర్చి దిద్ద వచ్చుననని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.తాజాగా అమలు చేసే వీఆర్ఎస్ పథకంలో ఇది ఒక ఆప్షన్ మాత్రమే కాకుండా.. బలవంతంగా బ్యాంకు నుంచి బయటకు పంపడానికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల కథనం. అయితే, త్వరితగతిన రిటైర్మెంట్ కావాలని కోరుకునే వారికి గుడ్ ఫైనాన్సియల్ ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది. బ్యాంకుల విలీనానికి ముందు కూడా కేంద్రం ఈ వీఆర్ఎస్ ప్రతిపాదన తీసుకొచ్చింది.
ఇక ప్రైవేటీకరించాల్సిన బ్యాంకుల జాబితాపై ఇటీవలే నీతి ఆయోగ్.. పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వశాఖల కార్యదర్శుల కమిటీకి సమర్పించింది.నీతి ఆయోగ్ ప్రతిపాదించిన బ్యాంకుల జాబితాను పరిశీలించాక పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వశాఖల కార్యదర్శుల కమిటీ.. కేంద్ర క్యాబినెట్కు సిఫారసులు సమర్పిస్తుంది. తుది నిర్ణయం కేంద్ర క్యాబినెట్ తీసుకుంటుంది.ప్రారంభ దశలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ల్లో రెండు బ్యాంకులు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. గతేడాది లక్ష్యం రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువ.