సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 72074 88745 మొబైల్ నంబర్కు కాల్ చేసి తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమస్యల గురించి తెలుసుకునేందుకు శనివారం పలువురి కొవిడ్ రోగులతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. చికిత్స కోసం ఒంటరిగా ఉన్నందున అదేవిధంగా కుటుంబంలో అందరికి కొవిడ్ సోకి ఐసోలేషన్లో ఉండటం వల్ల ఆహారం వండడానికి ఇబ్బందులు ఎదురౌతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఉచిత ఆహార పంపిణీ ప్రారంభింస్తున్నట్లు తెలిపారు.
ఆహార సహాయ కేంద్రం ద్వారా ఆహార ప్యాకెట్ల పంపిణీని పర్యవేక్షించడానికి ఇద్దరు సూపరింటెండెంట్ కేడర్ అధికారులను కలెక్టర్ నియమించారు. పోషక విలువలతో కూడిన 500 గ్రాముల బరువున్న కిచిడీ ప్యాకెట్లను పట్టణవ్యాప్త రోగులకు అందజేయాలని సూచించారు. ఫుడ్ ప్యాకెట్లను రవాణా చేయడానికి నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చినట్లు ఆయన చెప్పారు.