హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో ప్రవేశించి స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడింది. తాజాగా మరఠ్వాడా నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి వ్యాపించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఈ నెల 9వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ఆదిలాబాద్, వనపర్తి, సంగారెడ్డి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి, సూజాతానగర్లలో 3.5 సెం.మీ. వర్షం కురియగా.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుడిపూర్లో 3.25 సెం.మీ., భద్రాది కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెంలో 3.10 సెం.మీ. వాన కురిసింది. గ్రేటర్ హైదరాబాద్లో రాగల 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రలు 33.4 నుంచి 40.4 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వాపురంలో 40.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.