కరోనా అదునుగా దండుకుంటున్న ప్రైవేట్ దవాఖానలపై సర్కారు సీరియస్
ఆరు వైద్యశాలలకు నోటీసులు జారీ
వరంగల్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క రోనా కష్టకాలంలో ఇష్టారీతిన డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవే ట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. కొవిడ్ సోకి దవాఖానలో చేరిన వారికి అందించే వైద్యంలో లోపాలు, ఎక్కువ బిల్లుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కట్టడి చర్యలు చేపట్టింది. ఈ మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆరు హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేసింది. వీటిలో నగరంలోని జయ నర్సింగ్హోమ్తో పాటు మాక్స్కేర్, అజరా, లలిత, ఒమేగా బన్ను, స్టార్ హెల్త్ కేర్ హాస్పిటళ్లు ఉన్నాయి. ఆయా వైద్యశాలలు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో ప్రభుత్వం పేర్కొన్నది. సరైన స్పం దన రాకున్నా, ఆరోపణలు రుజువైనా సదరు హాస్పిటళ్ల అనుమతులను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నది.
అధిక వసూళ్లపై ఫిర్యాదులు
కరోనా వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలతో పలు ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుమతులు ఇచ్చింది. కరోనా రెండో దశలో వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరుగడంతో బాధితులు కూడా పెరిగారు. ఈ నేపథ్యంలో చాలా మంది వైద్య సేవల కోసం ప్రైవేట్ వైద్యశాలల్లో చేరారు. ఇదే అదునుగా పలు ప్రైవేట్ దవాఖానలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కరోనా వైద్య సేవలు, బిల్లుల ఖరారుపై ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేయగా ప్రభుత్వం స్పందించి చర్యలు మొదలుపెట్టింది.
కమిటీలతో తనిఖీలు
ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా వైద్య సేవలపై ప్రభుత్వం పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నది. ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీలను వేసింది. రాష్ట్ర స్థాయిలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కమిటీలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రైవేట్ వైద్యశాలలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, డిప్యూటీ పోలీస్ కమిషనర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి కమిటీలో ఉన్నారు. అధిక బిల్లులతోపాటు హాస్పిటళ్లలోని పేషంట్లకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తున్నది. కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంటున్నది. ప్రైవేట్ హాస్పిటళ్ల వైద్య సేవల్లో లోపాలు, ఎక్కువ బిల్లుల వసూలుపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో ఈ కమిటీలోని అధికారులు పలు దవాఖానలను తనిఖీ చేశారు. వీటిలో ఆద్య కిడ్స్, సెవెన్ హిల్స్, ఆపెక్స్, వినయ్, డాక్టర్ రాజు ఈఎన్టీ, శరణ్య, సిగ్మా హాస్పిటళ్లు ఉన్నాయి. వీటిపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు ఇచ్చారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా జిల్లాస్థాయి కమిటీల తనిఖీ, రాష్ట సర్కారు నోటీసులతో సంబంధిత హాస్పిటళ్ల నిర్వాహకుల్లో గుబులు రేగుతున్నది. అందిస్తున్న సేవల్లో లోపాలు, అధిక బిల్లుల వసూలుపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.