భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష
శాయంపేట, మే 23 : ధాన్యం తరలింపులో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపుపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీస్ డైరక్టర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలతో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఏ పీడీ సంపత్రావు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సవిల్ సప్లయ్ డీఎం భాస్కర్రావు హాజరయ్యారు. రవాణా కాంట్రాక్టర్, శ్రీనివాస్ రైస్మిల్లు యజమాని హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మండల పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యం, నిల్వ ఉన్న బస్తాలు, గన్నీ సంచుల వివరాలను డీఎంను అడిగి తెలుసుకున్నారు. ఆరు రోజులుగా రవాణా కాంట్రాక్టర్ వాహనాలు పెట్టలేదని సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాందారిపేటలో మండలానికి కేటాయించిన శ్రీనివాస్ రైస్ మిల్లు ఓనర్ కూడా రాకపోవడంతో ఏం చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యమా, సమీక్షకు రాకపోతే ఏం చేయాలి అని గండ్ర మండిపడ్డారు. రైస్మిల్లర్ వస్తే వారి అక్రమాలు బయటపడతాయని భయమా? అని అన్నారు.
మండల పరిధిలో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించే చర్యలను ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. తనతో పాటు ఎంపీపీ, రెవెన్యూ, పోలీసు అధికారులు రోడ్డెక్కి లారీలను పంపించామని మీరు చేయాల్సింది మేము చేస్తున్నామన్నారు. ఈనెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని మిల్లులకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ను ఎమ్మెల్యే గండ్ర కోరారు. శ్రీనివాస రైస్మిల్లుకు నాలుగు మండలాలు కేటాయించారని, శాయంపేట మండలం నుంచి వెళ్లిన వాహనాలను దిగుమతి చేసుకోవడం లేదని, ఇతర మండలాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమీక్షలో ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి పలువురు తీసుకెళ్లారు. శ్రీనివాస రైస్మిల్లుకు ధాన్యం తీసుకెళ్తే రూ.800 ఇస్తేనే లారీ వేయింగ్ వేస్తున్నారని, ట్రక్షీట్, వే బిల్లు ఇవ్వడం లేదని అడిగితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇస్తామని దబాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో మండలంలో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతున్నదని, అయినా రైతులు అధైర్యపడొద్దన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అన్నారు. వర్షాలు పడే అవకాశమున్నందున రవాణా కాంట్రాక్టర్ వాహనాలను సమకూర్చాలని, లేకుంటే అతడితో పాటు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం, శ్రీనివాస్ మిల్లు తనిఖీ
సమీక్ష అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధికారులతో కలిసి శాయంపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిబంధనల మేరకు 17 శాతం ఉండాల్సిన తేమ 30కిపైగా ఉండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు ఇచ్చిన ఏఈవో, నిర్వాహకులను మందలించారు. అనంతరం మాందారిపేట శ్రీనివాస రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లు ఓనర్ లేకపోవడంతో ఫోన్ చేసి మందలించారు. ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని సూచించారు. తమ వద్ద స్థలం లేదని చెప్పడంతో శాయంపేట, పెద్దకోడెపాకలోని గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హరితకు ఫోన్ చేసి మాట్లాడారు. ధాన్యం తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్బాబు, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, గిర్దావర్ హేమానాయక్, ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.