న్యూఢిల్లీ, మే 9: కరోనా నుంచి కోలుకొన్న, చికిత్స పొందుతున్న వారిపై బ్లాక్ ఫంగస్ దాడి(మ్యూకోర్మైకోసిస్) నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. కొవిడ్ రోగుల్లో ‘కంటి చూపు మందగించడం, ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండటం, పంటి నొప్పి, ఛాతిలో నొప్పి, ఊపిరి సమస్యలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకినట్టు అనుమానించాలని అని అడ్వైజరీలో సూచించింది. ఈ ఫంగస్ గాలిలో ఉంటుందని, పీల్చుకొన్నప్పుడు శరీరంలో చేరి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో వృద్ధి చెంది ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నది.
లక్షణాలు
కండ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, నొప్పి, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరిసమస్యలు, వాంతిలో రక్తం రావడం.
ఎవరికి ప్రమాదం?
నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు, స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు, ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు, అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు.
ఏం చేయాలి?
రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూసుకోవాలి. స్టెరాయిడ్లను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి. యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్ ఔషధాలను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
ఏం చేయకూడదు?
మ్యూకోర్మైకోసిస్ లక్షణాలను అలక్ష్యం చేయవద్దు. కొవిడ్ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోవద్దు. వెంటనే పరీక్షలు చేసుకోవాలి.