హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ముందుకొచ్చింది. దీనికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50 లక్షలు విరాళంగా అందజేయనుంది. ఈ మేరకు ఓయూతో ఎస్సీసీఎల్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ నిధులతో కళాశాలలో మూడు తరగతి గదులతో పాటు టాయ్లెట్లను నిర్మించనున్నారు. నిర్మాణ పనులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఎస్సీసీఎల్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ డైరెక్టర్ బలరాంలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.కుమార్, ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ సురేశ్కుమార్, పూర్వవిద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ దేవరకొండ విజయ్కుమార్, ఎస్సీసీఎల్ అధికారులు సూర్యనారాయణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.