లక్నో: చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒత్తిడికి గురైన భారత మహిళల జట్టు టీ20 సిరీస్ను చేజార్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో6 వికెట్ల తేడాతో ఓడిన టీమ్ఇండియా 0-2తో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను అప్పగించేసింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (47), రిచా ఘోష్ (44 నాటౌట్) మెరిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (7) విఫలమైనా హర్లీన్ డియోల్ (31).. షెఫాలీకి తోడుగా నిలువగా.. చివర్లో రిచా రెచ్చిపోయింది. అయితే మంచి లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెలే లీ (70), లారా వాల్వాట్ (53) దూకుడును అడ్డుకోలేకపోయారు. రాధా యాదవ్ చివర్లో కట్టడి చేసినా.. హర్లీన్ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు బౌండరీలు ఇవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో 2 బంతులకు 6 పరుగులు చేయాల్సిన దశలో తెలంగాణ పేసర్ అరుంధతీ రెడ్డి నోబాల్ వేయడంతో దక్షిణాఫ్రికా పని సులువైంది. చివరి బంతి వరకు ఆడి సఫారీ జట్టు 159 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో గైక్వాడ్, రాధా, హర్లీన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు
భారత మహిళలు: 158/4 (షఫాలీ వర్మ 47, రిచా ఘోష్ 44 నాటౌట్; బాష్ 1/26), దక్షిణాఫ్రికా మహిళలు: 159/4 (లిజెల్లీ లీ 70, వాల్వార్ట్ 53 నాటౌట్; రాజేశ్వరి 1/20)