నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు అని తెలియగానే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాడు ఈయన. ఒకటి రెండు కాదు వరసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈయన దూసుకుపోతున్నాడు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా సరిలేరు నీకు అన్నట్లు రచ్చ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈయన ఊ అనాలే కానీ చాలా మంది నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు.
అనిల్ సినిమా అంటే ఇప్పుడు 100 కోట్లు ఖాయం అనే నమ్మకం కూడా వచ్చేసింది నిర్మాతల్లో. సేఫ్ సినిమాలు చేస్తాడనే పేరు కూడా ఉండటంతో అతడి సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కంటిన్యూ అవుతున్నారు. వాళ్లతో పాటు ఎఫ్ 2లో ఎవరెవరు నటించారో అందరూ ఇందులో కూడా కనిపిస్తారని చెప్పాడు అనిల్ రావిపూడి. కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడి సినిమా ఎవరితో ఉండబోతుందనే అనుమానాలకు ఈ మధ్యే తెర దించాడు అనిల్. బాలయ్యతో అనిల్ రావిపూడి తర్వాతి సినిమా ఉండబోతుంది.
చాలా ఏళ్లుగా ఈ కాంబినేషన్ పై వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆయన 100వ సినిమాను అనిల్ చేయాల్సి ఉన్నా అనుకోకుండా ఆగిపోయింది. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్యతో అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. బాలయ్య ప్రస్తుతం బోయపాటితో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉంది. వీరి తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉండబోతుంది. నాగచైతన్య, సమంత మజిలీ సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బాలయ్య సినిమాను దాదాపు 70 కోట్లతో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం అనుకున్న దానికంటే కూడా 6 నెలలకు పైగానే ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి కాస్త గ్యాప్ తీసుకునే బాలయ్య సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు.