జగిత్యాల, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్ రమణ టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం జగిత్యాలలో ని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. టీడీపీకి తెలంగాణలో ఉనికి లేని పరిస్థితి నెలకొన్నదని, ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ నిరంతరం కృషి చేస్తున్నందున ఆ పార్టీలో చేరితే బాగుంటుందని కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తున్నది. రమణ సైతం టీటీడీపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కార్యకర్తలు, అనుచరులకు తెలియజేసినట్టు సమాచారం.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, రమణ బాల్యస్నేహితులు అయిన నేపథ్యంలో గతేడా ది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు, పార్టీలో చేరే విషయాన్ని చర్చించా రు. ఆ సమయంలో రమణ పార్టీని వీడేందుకు సుముఖత చూపినా.. అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై అధినాయకత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో రమణ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్లో చేరే విషయమై త్వరలోనే స్పష్టత ఇస్తానని పార్టీ శ్రేణులకు తెలిపినట్టు సమాచారం. ఈ విషయమై ఎల్ రమణను సంపద్రించగా.. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయగా.. టీఆర్ఎస్లో చేరడమే మేలనే అభిప్రాయం వెల్లడైందన్నారు.