‘రాజరాజచోర’ సినిమాలో లాయర్గా నటనకు ఆస్కారమున్న పాత్రను పోషించానని చెప్పింది సునయన. ఆమె కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హాసిత్ గోలి దర్శకుడు. శ్రీవిష్ణు హీరోగా నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో సునయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సినిమాలో నా పాత్ర పేరు విద్య. లాయర్గా కనిపిస్తా. ఆత్మవిశ్వాసం, ధైర్యం కలబోతగా నా క్యారెక్టర్ సాగుతుంది. ఈ పాత్ర కోసం నిజజీవితంలో లాయర్స్ కోర్టులో ఎలా వాదిస్తారో, వారి మాటతీరు, హావభావాలు ఎలా ఉంటాయో పరిశోధించి తెలుసుకున్నా. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ సినిమాలో నా క్యారెక్టర్ మాత్రం సీరియస్గా సాగుతుంది. ‘టెన్త్ క్లాస్’ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం నేను తెలుగులో నటించిన చిత్రమిది. తమిళంలో మంచి అవకాశాలు రావడంతో ఇన్నేళ్లు టాలీవుడ్కు దూరంగా ఉన్నా. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ అనే భేదాలు లేకుండా నటనకు ప్రాధాన్యమున్న అన్ని పాత్రలు చేయాలనుంది. నేను ఇష్టపడే వ్యక్తి ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా అతడెవరో నేను చెప్పను. ప్రస్తుతం తెలుగులో నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘మీట్క్యూట్’లో నటిస్తున్నా’ అని చెప్పింది.