సిద్దిపేటలో గులాబీ దూకుడు.. ముమ్మరంగా ప్రచారం
కొవిడ్ నిబంధనలతో ప్రచార సరళి
కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
పట్టణ అభివృద్ధిని వివరిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు
ప్రచారానికి అడుగడుగునా ఆదరణ
వార్డులను చుట్టేస్తున్న మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆది నుంచి టీఆర్ఎస్ కంచుకోట అయిన సిద్దిపేటలో బల్దియా ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు పత్తాలేకుండా పోయాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి సభలు, సమావేశాలు నిర్వహించడం లేదు. భారీ జనంతో ర్యాలీలు చేపట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా గులాబీ దళం ముమ్మరం ప్రచారం చేస్తున్నది. సీఎం కేసీఆర్ సహకారం,మంత్రి హరీశ్రావు నాయకత్వంలో పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరిగింది. అనేక అంశాల్లో సిద్దిపేట దేశానికి ఆదర్శంగా మారింది. ఇవన్ని అంశాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
“సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. ఈ గులాబీ తోటలో కలుపు మొక్కలు అవసరమా? ఆ కలుపు మొక్కలను కూకటి వేళ్లతో ఏరి పారేయండి, గాడిదకు గడ్డేసి గేదెకు పాలు పితికితే వస్తాయా? ఇక్కడ వేరే పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందా? ఆపదైనా, కష్టమైనా, సుఖమైనా, పండుగైనా, పబ్బమేదైనా, హరీశన్న అనగానే వచ్చి వాలెటోన్ని నేనున్నా. ఎన్నడైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మీ కష్టసుఖాల్లో మీ వెంట ఉన్నారా? మీ అందరితో ఒక్కటే కోరుతున్నా ఎప్పుడైనా వీళ్లు కనపడ్డ్డరా? మీకు ఎప్పుడైనా సేవ చేసిండ్రా? మనదంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో ఏ సభ్యుడికి కష్టమొచ్చినా నేను దగ్గరుండి చూసుకుంటున్నా. టీఆర్ఎస్ వాైళ్లెన మనవాళ్లను కౌన్సిలర్లుగా గెలిపిస్తేనే నేను కూడా మీ అందరికీ దగ్గరుండి పనిచేసిన వాడినవుతా. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడు కనిపిస్తారు తప్ప మళ్లీ ఈ వైపు కూడా రారు. అలాంటి పార్టీలను నమ్మొద్దు. నిజమైన వాళ్లు కారు గుర్తు ఉన్న అభ్యర్థులు. కారు గుర్తు గెలిస్తే టీఆర్ఎస్ గెలిచినట్లు. సీఎం కేసీఆర్ గెలిచినట్లు, హరీశ్రావు గెలిచినట్లు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.” అంటూ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిస్తున్నారు.
సిద్దిపేట పురపోరులో ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ దళం ప్రచార హోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారవుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు మండుటెండలు…మరోవైపు కొవిడ్ భయపెడుతున్నది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా వార్డుల్లో చిన్న చిన్న ర్యాలీలు…వాడవాడలా తిరుగుతూ…ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు దూసుకపోతున్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు చేపట్టిన అభివృద్ధి పనులను తెలిపే ప్రత్యేక సంచికను ఇంటింటికీ పంచుతూ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ది చేశారని గుర్తు చేస్తున్నారు. “ఇంటి ముందు అభివృద్ధి…కంటి ముందు అభ్యర్థి” అనే నినాదంతో ముందుకు వెళ్తుతున్నారు. రెండు రోజుల నుంచి మంత్రి హరీశ్రావు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
మీ కష్టసుఖాల్లో నేనున్నాను అంటూ ప్రజలకు మంత్రి హరీశ్ చెబుతున్నారు. సిద్దిపేట పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి …అందుకు నాకు కుడి భుజంలా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని కోరుతున్నారు. మరో వైపు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తం రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తదితర నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయా వార్డుల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఇన్చార్జిలుగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో టీఆర్ఎస్ శ్రేణులు గడప గడపకూ వెల్లి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు సిద్దిపేట అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతున్నారు. వార్డు ఇన్చార్జిలు ఆయా వార్డుల్లో అభ్యర్థులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో వార్డులో ప్రచారంలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రచారానికి కేవలం రెండు రోజులే ఉండడంతో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.