హ్యూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి నలుగురు వ్యోమగాములు ప్రైవేటు కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్లో భూమికి తిరిగి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న క్యాప్సూల్ ఆదివారం ఉదయం ఫ్లారిడాకు సమీపంలోని పనామాసిటీ తీరంలోని సముద్రంలో ల్యాండ్ అయింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో అంతకంతకూ పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యానికి ఈ ఘటన అద్దం పడుతుంది. స్పేస్ ఎక్స్ అనేది పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన అంతరిక్ష పరిశోధనా కంపెనీ. ఈ ఆపరేషన్ కోసం స్పేస్ ఎక్స్ రెజిలెన్స్ క్యాప్సూల్ వినియోగించారు. తిరిగివచ్చిన వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికన్లు, ఒక జపనీస్ ఉన్నారు. ఆరున్నర గంటల ప్రయాణం తర్వాత వారు భూమి మీదకు దిగారు. వారు అంతరిక్షంలోకి వెళ్లేందుకు కూడా ఇదే క్యాప్సూల్ను వినియోగించారు. ప్యారాచూట్ సాయంతో క్యాప్సూల్ మెక్సికో సిందుశాఖలోకి వచ్చి పడింది. వ్యోమగాములను అమెరికా తీరప్రాంత రక్షక దళం ముందుగా హెలికాప్టర్ లో ఫ్లారిడాకు, అక్కడి నుంచి విమానంలో టెక్సాస్లోని హ్యూస్టన్కు తరలించారు. వీరి రాకతో ఐఎస్ఎస్లో ఇక ఏడుగురు వ్యోమగాములు మాత్రమే మిగిలారు. సాధారణ విమాన ప్రయాణాల కంపెనీలు తరచుగా ప్రయాణించేవారికి ఎక్స్ట్రా మైల్స్ ఇచ్చినట్టుగానే స్పేస్ ఎక్స్ కంపెనీ నలుగురు వ్యోమగాములకు 68 మిలియన్ మైళ్ల అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై క్యాప్సూల్ కమాండర్ మైక్ బాప్కిన్స్ కూడా సరదాగా స్పందిందారు. ఈ ఎక్స్ట్రా మైల్స్ను ఇతరులకు బదలాయించుకోవచ్చా అని ఆయన తనకు సందేశం పంపిన రిప్రజెంటేటివ్స్ను ప్రశ్సించారు. దానికి వారు కంపెనీ మార్కెటింగ్ డిపార్టుమెంటును సంప్రదించమని సమాధానమిచ్చారు. ఈ మిషన్ లో పాల్గొన్న వ్యోమగాములు 167 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. 1974లో స్కైల్యాబ్ మిషన్ తర్వాత అమెరికా వ్యోమగాములు ఇంత సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్ర జరపడం ఇదే ప్రథమం. స్కైల్యాబ్ మిషన్ 84 రోజులపాటు కొనసాగింది.