‘కీర్తిసురేష్తో నా కెమిస్ట్రీ బాగుందంటున్నారు. మేమిద్దరం కథను నమ్మి సినిమా చేశాం. ఆ నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు’ అని అన్నారు నితిన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కీర్తిసురేష్ కథానాయిక. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ‘సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఆహ్లాదభరిత ప్రేమకథకు వినోదం, భావోద్వేగాలు మేళవించి దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ‘అఆ’, ‘భీష్మ’ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్లో నేను చేసిన మూడో సినిమా ఇది. హ్యాట్రిక్ హిట్ దక్కడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘అర్జున్, అను పాత్రల్ని నితిన్, కీర్తి సురేష్ ఓన్ చేసుకొని నటించారు. అందువల్లే క్యారెక్టర్స్, సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ విజయంలో నాయకానాయికలతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహాకుడు పీసీ శ్రీరామ్ మూలస్తంభాల్లా నిలిచారు’ అని దర్శకుడు పేర్కొన్నారు. ప్రతి షోకు వసూళ్లు పెరుగుతున్నాయని, ఈ వారాంతంలో లాభాల బాట పడుతామనే నమ్మకముందని నిర్మాత నాగవంశీ చెప్పారు.