నందమూరి తారకరామారావు నట వారసుడు హరికృష్ణ నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నిలిచిన నందమూరి హరికృష్ణ ‘శ్రీకృష్ణావతారం’లో నటించి అలరించారు. నటుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాలలోను సత్తా చాటారు. తండ్రి యన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మధ్యలో నటనకు దూరంగా ఉన్న హరికృష్ణతో ‘శ్రీరాములయ్య’లో ఓ కీ రోల్ పోషింప చేశారు దర్శకుడు ఎన్.శంకర్. తరువాత వైవిఎస్ చౌదరి తన ‘సీతారామరాజు’లో హరికృష్ణను, ఏయన్నార్ నటవారసుడు నాగార్జునను కలిపి తెరకెక్కించారు. ఇద్దరు మహానటుల వారసుల చిత్రం కాబట్టి, ఈ సినిమా జనాన్ని అలరించింది.
కృష్ణతో కలసి హరికృష్ణ నటించిన ‘శ్రావణమాసం’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ హరికృష్ణ కెమెరా ముందుకు రాలేదు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, వారి పేర్లు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్. వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తరువాత నాలుగేళ్ళకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. ఈ రోజు హరికృష్ణ జయంతి కావడంతో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్తో పాటు నందమూరి అభిమానులు ఆయనని స్మరించుకుంటున్నారు.