న్యూఢిల్లీ, మే 30: న్యాయవాదిగా, అనంతర కాలంలో న్యాయమూర్తిగా కొనసాగటానికి తనకు ప్రేరణగా నిలిచిన వ్యక్తుల్లో సొలీ సొరాబ్జీ ఒకరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రఖ్యాత న్యాయకోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ కన్నుమూసి నెల రోజులు ఆయిన సందర్భంగా సీజేఐ ఆయనకు నివాళి అర్పించారు. వర్చువల్ మాధ్యమంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. న్యాయశాస్త్రంలో సొరాబ్జీది అందెవేసిన చెయ్యి అని, ఆయన బుద్ధి కుశలత అద్భుతమని కొనియాడారు. రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో ఆయన్ని ఛాంపియన్గా అభివర్ణించారు. ఎమర్జెన్సీ సమయంలో పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సొరాబ్జీ తీవ్రంగా కృషిచేశారన్నారు. కేసులకు సంబంధించి సొరాబ్జీకి పూర్తి అవగాహన ఉండేదని, ఎంత చిక్కుముడిలాంటి కేసులనైనా ఆయన సరళంగా పరిష్కరించేవారని తెలిపారు. న్యాయ రంగంలో కొనసాగేందుకు తనకు ప్రేరణగా నిలిచిన వ్యక్తుల్లో సొరాబ్జీ ఒకరని పేర్కొన్నారు. ‘ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ విలువలు, పౌరుల స్వేచ్ఛ, హక్కులను కాపాడినప్పుడే.. సొరాబ్జీకి అసలైన నివాళి’ అని సీజేఐ తెలిపారు. దేశ చట్టాలను పరిపుష్ఠం చేసే ప్రముఖ కేసుల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. న్యాయవ్యవస్థకు గౌరవాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. సొరాబ్జీ ఏప్రిల్ 30న కరోనాతో కన్నుమూశారు.