పట్టువదలని ప్రతిభావంలతులు
పట్టుదలతో శ్రమించి.. ప్రణాళికతో చదివి..
ఉద్యోగాలు పొందిన యువత
కొలువు చేస్తూనే మరో ఉన్నత ఉద్యోగానికి దరఖాస్తు
తెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్లు సద్వినియోగం
రఘునాథపాలెం/పెనుబల్లి/బోనకల్లు/ వేంసూరు/కూసుమంచి రూరల్/చండ్రుగొండ, ఏప్రిల్ 10 : పుట్టింది పేదరికంలో కావొచ్చు.. ఉన్నత స్థాయికి ఎదగడానికి వారంతా చదువు ఒక్కటే మార్గం అనుకున్నారు.. పట్టుదలతో చదువు పూర్తి చేశారు.. కొందరు ప్రభుత్వ కొలువులు, మరికొందరు ప్రైవేటు కొలువులు సాధించారు.. కానీ వచ్చిన ఉద్యోగాలతో సంతృప్తి చెందలేదు.. ప్రైవేటు ఉద్యోగం మానేసి ఒకరు, ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే ఇంకొందరు సర్కారు కొలువులకు దరఖాస్తు చేసుకున్నారు.. చివరికి తాము అనుకున్న గమ్యం చేరుకున్నారు. ‘కొలువు’దీరారు.. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
చదువుతో ఉన్నత స్థాయికి..
మాది వేంసూరు. నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. అయినప్పటికీ బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని నమ్మాను. స్వశక్తితో చదువుకున్నాను. కానిస్టేబుల్ కొలువు సాధించాను. ఆ తర్వాత మా సోదరుడు కిన్నెర జంగయ్య కానిస్టేబుల్ ప్రోత్సహించడంతో ఎస్సైకి ప్రిపేర్ అయ్యాను. 2018లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సై నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నా. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సివిల్ ఎస్సైగా కొలువు సాధించా. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి పోలీస్స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేస్తున్నా. పట్టుదలతో చదువుకుని నా ప్రతిభ ఆధారంగా ఉద్యోగం సాధించడం ఆనందాన్నిచ్చింది. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా. – కిన్నెర రాజశేఖర్, ప్రొబేషనరీ ఎస్సై, ములకలపల్లి
పేదలకు సేవ చేస్తా..
నాన్న గృహ నిర్మాణశాఖలో ఉద్యోగి. మాది పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం. అమ్మానాన్నలు నిరుపేదలకు ఎంతో కొంత సాయం చేయాలని చిన్నప్పటి నుంచి చెప్పేవారు. 2016లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించా. కొన్నాళ్లు కొలువు చేశా. కానీ నా ఆసక్తి పోలీస్ ఉద్యోగం మీద మళ్లింది. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా నేను దరఖాస్తు చేసుకున్నా. మొదటి ప్రయత్నంలోనే ఎస్సై కొలువుకు ఎంపికయ్యా. ప్రస్తుతం పాల్వంచ టౌన్ పోలీస్స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నా పరిధిలో, నాకు వీలైనన్ని సేవలు పేదలకు అందిస్తా. – చావల చంద్రశేఖర్, ప్రొబేషనరీ ఎస్సై, పాల్వంచ టౌన్
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశా
మాది గోవిందాపురం గ్రామం. నేను ఏపీలోని నూజివీడు ట్రిపుల్ఐటీలో చదివా. చదువు పూర్తయిన తర్వాత ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరా. ఆరు నెలలు ఉద్యోగం చేశాక 2018 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కొలువులకు నోటిఫికేషన్ వేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశా. పోటీ పరీక్షలో మంచి మార్కులు సాధించాను. నాకు తూటుకుంట్ల పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంతృప్తిగా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్నవారికి కొలువులు ఇచ్చింది.