‘తెలుగు సినిమాతోనే కథానాయికగా నా ప్రయాణం ఆరంభమైంది. నటిగా ఎంతో పేరుతీసుకొచ్చిన తెలుగు చిత్రసీమలో నేను చేయబోతున్న మరో మంచి సినిమా ఇది’ అని చెప్పింది హన్సిక. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘ది హిడెన్ ట్రూత్’ ఉపశీర్షిక. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్రాజు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హన్సికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బేబీ రేవతి క్లాప్నివ్వగా, వైష్ణవి కెమెరా స్విఛాన్ చేశారు. వంశీ గౌరవ దర్శకత్వం వహించారు. హన్సిక మాట్లాడుతూ ‘నేను కథానాయికగా నటిస్తున్న 52వ చిత్రమిది. ఇందులో స్వతంత్య్రభావాలు కలిగిన శృతి అనే అమ్మాయిగా నా పాత్ర చాలెంజింగ్గా ఉంటుంది. మహిళా ప్రధాన కథాంశంతో సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమా ఇది’ అని తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘కొంత విరామం తర్వాత హన్సిక తెలుగులో నటిస్తోన్న సినిమా ఇది. ఆద్యంతం ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది. లీడ్ రోల్లో నటించడానికి చాలా మంది నాయికలు భయపడ్డారు. కానీ కథ విని హన్సిక ధైర్యంగా అంగీకరించింది’ అని తెలిపారు. ‘ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉండటం సహజమే. కానీ ఈ సినిమాలో ఓ మహిళ ఎదుర్కొనే సంఘర్షణకు మగాడు కారణమవుతాడు. అతడెవరూ? ఆ సంఘర్షణ నుంచి ఆమె ఎలా బయటపడిందన్నది ఆకట్టుకుంటుంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతాం. ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్ను, ఆగస్ట్లో మూడో షెడ్యూల్ను ప్రారంభిస్తాం’ అని దర్శకుడు పేర్కొన్నారు. మురళీశర్మ, జయప్రకాష్, సాయితేజ, పూజారామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ: కిశోర్
బోయిడపు.