ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
ఆదిలాబాద్ టౌన్, మార్చి 20 : అడవులు పచ్చగా ఉంటేనే పక్షులు, వన్యప్రాణి మనుగడ ఉంటుందని, తద్వారా జీవవైవిధ్యంతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. పక్షుల కోసం మట్టి పాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యతన్నారు. అడవులతో ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రకాల పక్షులను తన కెమెరా ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తున్న పక్షి ప్రేమికుడు లింగంపల్లి కృష్ణను అభినందించారు. అనంతరం తాను మహారాష్ట్ర రిజర్వు ఫారెస్టులో తీసిన అరుదైన గుడ్లగూబ చిత్రాన్ని కలెక్టర్కు కృష్ణ అందజేశారు. డీఎఫ్వో చంద్రశేఖర్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీష పాల్గొన్నారు.