రూ.146 కోట్లతో అంచనాలు తయారు
కరుణగిరి బైపాస్ నుంచి ప్రకాశ్నగర్ చప్ట్టా వరకు నిర్మాణం
సుమారు 5.8 కిలో మీటర్ల పొడవున మున్నేరుకు ఇరువైపులా కరకట్ట
వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, పార్కుల నిర్మాణం, ఓపెన్ జిమ్లు
నిధుల మంజూరుకు మంత్రి కేటీఆర్ హామీ
ఖమ్మం, ఏప్రిల్ 5 :గతంలో వరదలతో ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మున్నేరు పొంగి పొర్లినప్పుడల్లా పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇక మీద మున్నేరు కష్టాలు తీరనున్నాయి. పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. మున్నేరుకు ఇరువైపులా కరకట్ట నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీతో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనున్నది. కరకట్ట నిర్మించడం ద్వారా వరద తాకిడిని అడ్డుకునే అవకాశం ఉంది. కరుణగిరి బైపాస్ నుంచి ప్రకాశ్నగర్ చప్టా వరకూ 2.9 కిలోమీటర్ల చొప్పున మున్నేరుకు రెండు వైపులా కలిపి 5.8 కిలోమీటర్ల వరకు కరకట్టను నిర్మించనున్నారు. ఇందుకోసం జలవనరులశాఖ అధికారులు రూ.146 కోట్లతో అంచనాలు రూపొందించారు.
ఖమ్మానికి మరో మణిహారం రానుంది. మున్నేరు కరకట్టకు రెండు వైపులా కరకట్ట నిర్మించడం ద్వారా వరద తాకిడిని అడ్డుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా పరీవాహక ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కరుణగిరి బైపాస్ నుంచి ప్రకాశ్నగర్ చప్టా వరకూ 2.9 కిలోమీటర్ల చొప్పున మున్నేరుకు రెండు వైపులా కలిపి 5.8 కిలోమీటర్ల మేర కరకట్టను నిర్మించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషి, ముఖ్యమంత్రి కేసీఆర్, యువ నేత కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఖమ్మం నగరానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే ఈ ఐదేళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నది. దీంతో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోతున్నాయి.
కరకట్ట నిర్మాణానికి గ్రీన్సిగ్నల్
ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలకు మంత్రి కేటీఆర్ హామీతో మంచి రోజులు రానున్నాయి. మున్నేరుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరైతే ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు రూ.146 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కరుణగిరి బైపాస్ రోడ్డు నుంచి ప్రకాశ్నగర్ చప్టా వరకు మున్నేరుకు ఇరువైపులా సుమారు 5.8 కిలోమీటర్లు పొడవున కరకట్టను నిర్మించనున్నారు. ఏటా వర్షాకాలంలో మున్నేరుకు వరదలు సంభవించినప్పుడు దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి అజయ్.. కరకట్ట ద్వారా వారికి శాశ్వత పరిష్కారం చూపనున్నారు. దానవాయిగూడెం నుంచి ప్రకాశ్నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా కరకట్టను నిర్మిస్తే మున్నేరు వరద ముంపు బాధ తప్పుతుంది. దాదాపు 2.5 కి.మీ కరకట్టను నిర్మించి దానిపై మొక్కలను నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పార్కుల మాదిరిగా సుందరీకరించబోతున్నారు. లకారం ట్యాంక్బండ్ మాదిరిగా మున్నేరు కరకట్ట కూడా త్వరలోనే మరో మణిహారం కానుంది.
ఖమ్మం జిల్లా అవసరాలకు 4 టీఎంసీలు..
ఏటా వర్షాకాలం సీజన్లో మున్నేరు వరద ద్వారా ఖమ్మం జిల్లా నుంచి 3 లక్షల క్యూస్సెక్కుల నీరు వృథాగా పోతోంది. ఈ జలాలు 30 టీఎంసీలకు సమానం. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చు. అంటే మున్నేరు నుంచి వృథాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకుంటే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మున్నేరుపై ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని తీర్థాల – కామంచికల్ మధ్య, పొలిశెట్టిగూడెం – పడమటి తండా మధ్య మున్నేరుపై చెక్డ్యాం, బ్రిడ్జీలను నిర్మించింది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ వద్ద మరో చెక్డ్యామ్ నిర్మాణంలో ఉంది. ప్రకాశ్నగర్ వద్ద చెక్డ్యామ్ నిర్మిస్తే ఖమ్మం ప్రజలకు తాగునీటి ఇబ్బందులూ తీరుతాయి. సాగునీటి వినియోగం కోసం మంత్రి పువ్వాడ మున్నేరుపై చెక్డ్యామ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి