రామగిరి, మే 4 : కరోనా వైరస్ సోకిన వ్యక్తులు భయపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో కొవిడ్ పేషెంట్ల వార్డును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అందుతున్న సేవలు, వైద్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్ వార్డుకు తన నిధుల నుంచి ప్రత్యేకంగా రూ.5 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంతో నల్లగొండ దవాఖాన ముందున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కరోనా వార్డులో ఆక్సీజన్, బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్ కొరత లేకుండా చూడాలని దవాఖాన సూపరింటెండెంట్ నర్సింహులను ఆదేశించారు.దవాఖానకు కావాల్సిన నిధులను వెంటనే కేటాయించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) రమేశ్రెడ్డికి సూచించారు. మెడికల్ కిట్స్, గ్లౌజ్లు, మాస్కులు, శానిటైజర్ను సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, మెడికల్ జనరల్ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహ ఉన్నారు.