ఒక సినిమా చేయాలంటే కోట్లలో ఖర్చు చేయాలి. అదే స్టార్ హీరో సినిమాలో ఉంటే తక్కువలో తక్కువ 50 కోట్లు పెట్టాల్సిందే. మీడియం రేంజ్ హీరో సినిమాకు కూడా 20 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు సరైన సమయం చూసి విడుదల చేయడం కనీస బాధ్యత. అందుకే కరోనా పాండమిక్ సమయంలో తమ సినిమాలను విడుదల చేయకుండా అలాగే ఉండిపోయారు నిర్మాతలు. అలా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 40 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే విడుదల చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతలు ఎవరు తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సాహసించడం లేదు. ఇలాంటి సమయంలో గోపీచంద్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా గతేడాది సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశాడు. 7 నెలల థియేటర్లు మూత పడిన తర్వాత డిసెంబర్ లో పూర్తిస్థాయిలో ఓపెన్ చేశారు. ఆ సమయంలో నిర్మాతలు ఎవరూ సినిమాలు విడుదల చేయడానికి ముందుకు రాకపోతే సోలో బ్రతుకే సో బెటరూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా మేనల్లుడు.
ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. తొలిదశ వైరస్ పూర్తయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ లీడ్ తీసుకుంటే.. సెకండ్ వేవ్ చివరి దశకు వచ్చిన తర్వాత గోపీచంద్ తొలి అడుగు వేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటించిన సీటీమార్ సినిమా చాలా రోజులుగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నాలుగేళ్లుగా రిలీజ్ కి నోచుకోని ఆరడుగుల బుల్లెట్ కూడా ఈ సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా రెండు సినిమాలతో గోపీచంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఏదేమైనా వీటికి వీటికి వచ్చే రెస్పాన్స్ చూసిన తర్వాత మిగిలిన సినిమాలు విడుదల చేయాలా వద్దా అని దర్శక నిర్మాతలు నిర్ణయించుకోనున్నారు.