ఘంటసాల.. ఆ పేరు వినగానే మధురమైన గాత్రం మనకు గుర్తుకు వస్తుంది. వేలాది పాటలతో శ్రోతలను ఎంతగానో అలరించిన ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు రత్నకుమార్ డబ్బిండ్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేసుకున్నాడు.తండ్రి బాటలో పయనించకుండా వేరే దారిని ఎంచుకున్నాడు.మాటల రచయితగా కూడా సినీ పరిశ్రమకు తన సేవలను అందిస్తున్నాడు రత్నకుమార్. అయితే దర్శకుడిగా మంచి సినిమా తీస్తానని చెప్పిన రత్నకుమార్ ఆ కోరిక తీరకముందే కన్నుమూసారు.
కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన రత్నకుమార్ ఈ మధ్యే కోలుకున్నారు.అయితే చాలా రోజులుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్పై ఉన్నారు. గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. యన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు ఆరుగురు సంతానం కాగా, అందులో ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో రత్నకుమార్ రెండోవారు. ఇతను తప్ప మిగిలిన వారెవరూ సినీ రంగంలో అడుగుపెట్టలేదు. కెరీర్ మొదట్లో నాలుగు ఐదు చిత్రాలకు పాటలు పాడిన ఆయనకు అనువాద విభాగంలో అవకాశాలు ఎక్కువ రావడంతో అటు వైపు వెళ్లారు. ఆయన కుమార్తె వీణ తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పాటలు పాడుతూనే ఉంది. ఇక రత్నకుమార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు . హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్ఖాన్, షారుక్ఖాన్లకు ఆయన ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ వంటి సినిమాలకు మాటలు కూడా అందించారు రత్నకుమార్.
ఎప్పటికైనా సినిమా దర్శకుడుగా మారాలని, ఇందుకోసం కథ, డైలాగులు, మాటలు, పాటలు సిద్ధం చేసుకుంటున్నానని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు రత్నకుమార్ . మంచి నిర్మాత దొరికితే త్వరలోనే తీస్తా అని చెప్పిన ఆయన ఇలా అకాల మరణం చెందడం అందరిని బాధిస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు అందుకున్న ఆయన జెమినీ టీవీలో విశ్వదర్శనం సీరియల్ యాంకర్గా కూడా పనిచేశారు. తమిళనాడు, కర్నాటక మూవీ అసోసియేషన్లు కళై శైవం, కురల్ సెల్వం బిరుదులతో ఆయనను సత్కరించారు.