కరోనా భయపెడ్తున్నది. ఏమైతదో ఎవరికీ తెల్వదు. ఎన్కటికి కూడా ఇసొంటియి మస్తుగొచ్చినయి. అప్పుడెట్లా ఎదుర్కొన్నరు? గానుగుపెంట సాలీ ఏం చెప్తుంది?
నా పేరు సాలీ రుడావత్. మా ఆయన పేరు నీల్యా. మాది నాగర్ కర్నూల్ దగ్గర గానుగుపెంట తండా. మేం లంబడోళ్లం. మా తల్లిగారి ఊరు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నరెడ్డిగూడెం. చిన్నతనమంతా ఆరుట్ల, మంచాల, జాపాల, కొదాస్పల్లి, లోయపల్లి, బోడకొండ గుట్టలపొంటే గడిచింది. రాచకొండకు పారువట్టి ఉన్న ఊర్లవి. అప్పట్ల పొద్దుమూకిందంటే ఇంట్లకెల్లి ఎవలూ బైటికి రాకపోదురు. అది అన్నల రాజ్జెం. ఆళ్లెక్కడుండేదో మాకైతే తెల్వకపోవు. కానీ పోలీసోల్లకు ‘లంబడోళ్ల ఇండ్లల్లనే అన్నలు ఉంటరు. తింటరు’ అని ఒగ అనుమానం.
మూడురోజులు నడిశి
బాగా గుర్తుకుంది. ఒకరోజు పొద్దుమూకినయాల్ల. కచ్చీర్కాడ ఏవో పాటలినిపిస్తున్నయి. సప్పట్ల సప్పుడొస్తుంది. బాగోతులాడ్తుండ్రేమో అనుకున్నం. కానీ అది బాగోతుల పదాలుగావు. మేంగూడా పోయినం. అన్నలు మీటింగ్వెట్టి రాజ్జెం దోపిడి గురించి చెప్పిండ్రు. అగో అప్పుడు చూసినం అన్నలను. మాకు గొర్లు, మ్యాకలుంటుండె. అవి కాసుకుంటనే మా నాయిన మమ్ములను పెంచి పెద్దజేసి పెండ్లీలు జేసిండు. మా అత్తగారి ఊరు అచ్చంపేట దగ్గర. ఆపొద్దు బస్సుల్లేవు, జీపుల్లేవు. ఎడ్లబండ్లు ఉండేటియి కానీ మా అసొంటి పేదోళ్లకు ఉండకపోవు. పెండ్లిజేసి అత్తగారింటికి పంపించిండ్రంటే చూడనీకె ఆర్నెళ్లకో, యాడాదికో వస్తుండె మా అమ్మనాయిన. అదిగూడా మూడు నాలుగు రోజులు నడ్సుకుంట వచ్చేటోళ్లు. సద్దిగట్టుకొని, నీళ్లు తీస్కొని అదో తీర్తంబోయినట్టే ఉంటుండె. నేను అమ్మగారింటికి రావాలన్నా ఇదే కత. పాపం పోరగాళ్లకు వద్దామని ఉంటుండె. చీకట్ల, మాపట్ల పోవుడాయె అనీ పాలుతాగే పిలగాళ్లనే తీస్కపోదుము. ఆడేమైతుందే ఈడ తెల్వకపోవు. ఈడేమైతుందో ఆడ తెల్వకపోవు.
అడివే అన్నీ ఇచ్చేది
నాకు ఐదుగురు కొడుకులు. ఇద్దరు బిడ్డెలు. ఆనాడు సూద్దమన్నా పైస ఉండకపోవు. నా ఎర్కల ఏకాన, దోవాన, ఎక్వలో ఎక్వ చారాన చూసినం. మాకు కాయకష్టం తప్ప వేరేపని లేకపోవు. వారంల నాలుగు రోజులు అడివిపొంటి తిరిగి పండ్లూ, దుంపలు తెంపి వారంనాడు అమ్డాపురం అంగట్ల అమ్మెనీకె పోదుము. ఎంతమ్మినా పైస సూడకపోదుము. మాకు కావాల్సింది తిండి. పండ్లు, దుంపలను ఇచ్చి కొర్రలు, సద్దలు తెచ్చుకుందుము. ఆ ఆకూ, ఈ ఆకూ, అడివి దొండకాయలు, అడివి కాకరకాయలు తెంపి కూరొండుకుందుము. ఇగ రాంగ రాంగ కొద్దిగా మారింది. సుట్టమో, పక్కమో వస్తే కోడిని కోస్తుంటిమి. థీజ్ పండుగకు సుట్టాలను పిలిశి యాటనుగోసి దావత్జేస్తున్నం. అప్పుడుగూడా కరోనొచ్చినట్టే గత్తరొచ్చేది. నా ఎర్కల ఓ పదిసార్ల గత్తర బీమారొచ్చింది. ఏమైంది ఏంగాలె? అప్పుడు ఈ మందులెక్కడియి? మాకులు ఎక్కడియి? ఆకు పసరుతోటే ఎంతపెద్ద బీమారొచ్చినా బాగజేసుకుందుము.
కోళ్లు, మ్యాకలు కోసుకున్నం
అప్పుడు నేను ఇద్దరు పిల్లల తల్లిని. రేపు తెల్లారితే లోకం మునిగిపోతుందని పుకారు లేపిండ్రు. మాదేమో చిన్న జీవితం. ‘ఏంజేద్దామె’ అని అడిగిండు మా ఇంటాయిన. ‘ఇది అరీల పున్యకాలం. ఇయ్యాలైనా ఇట్లనే ఉంటం. రేపయినా ఇట్లనే ఉంటం. అడివిల తిరుగడు, అంగట్ల అమ్ముడే చెయ్యాలె. ఉన్నా నష్టంలేదు. పోయినా నష్టంలేదు. పాపం మంచినీళ్లు పుట్టని లోకమిది. పిల్లల కోసం, ఆళ్లను నిమ్మళంజేస్తందుకు ఇయ్యాల ఒక్కనాడైనా కమ్మగ తిందాం’ అని చెప్పిన. మేకలు, కోళ్లు కోసుకున్నం. ఎన్నడూ లేనంత మంచిగ ఒండుకున్నం. బగ్గతిని లోకం ఎప్పుడు మునిగిపోతదా అని మేల్కె ఉన్నం. తెల్లారింది. ఎట్లున్నమో అట్లనే ఉన్నం. తండాల పొయ్యిచూస్తె అందరూ నిమ్మళంగనే ఉండ్రు. నవ్వాల్నా? ఏడ్వాల్నా అర్థంగాలె. నెల్లాళ్లకయ్యే ఉప్పు, పప్పులు ఒడిశినయి ఆ ఒక్కరోజే. ‘ఓరినీ.. అంటులేకుంట ఊడ్శేశినం. పారవోశినం. రేపటిసంది ఏంతినాల్రో నాయనా’ అనుకున్నం. ఇప్పుడు ఈ కరోనను చూస్తెగూడా అట్లనే అనిపిస్తుంది.
మాకెప్పుడూ దూరమే
మనుమలు, మనుమరాండ్లు అంతా కల్శి యాబైమంది దాక అయిండ్రు. ఇప్పుడు పింఛిన్ తీస్కుంట ఇంట్లనే ఉంటున్న. ఆ పొద్దు బస్సులు, జీపుల్లేక అమ్మగారింటి పోవాల్నంటే ఎట్లయితే బాధవడ్డమో, ఇప్పుడు పిలగాళ్లను చూడాలంటే అట్లనే బాధైతుంది. ఆళ్లేమో ఒక్కొక్కలు ఒక్కోతాన ఉండ్రు. కండ్లల్ల కట్టినట్లుండి సూద్దామంటే సూడలేని, మాట్లాడ్దామంటే మాట్లాడలేని పరిస్థితి. మా ఊళ్లె ఫోన్లు కల్వవు. అదేదో సిగ్నలుండదు. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా మా పిలగాండ్లకు, మాకు దూరమే ఉంది.
-దాయి శ్రీశైలం