శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకురాలు. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా విశేషాలను వివరిస్తూ గురువారం సమావేశం నిర్వహించారు. శ్రియ మాట్లాడుతూ ‘ఈ కథ దర్శకురాలు హృదయం నుంచి ఉద్భవించింది. మనసును తట్టే భావోద్వేగాలతో సాగుతుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ‘ఏ కథ చెప్పినా అందులో ఏదో ఒక నైతిక సందేశం ఉండాలన్నది నా సిద్ధాంతం. అలాంటి కథే ‘గమనం’. ఇళయరాజాగారు ఈ చిత్రానికి స్వరాల్ని అందించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. శ్రియ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది’ అని దర్శకురాలు తెలిపింది. కథ వినగానే సంభాషణలు రాయాలనే ప్రేరణనిచ్చిందని రచయిత సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు. శివ కందుకూరి మాట్లాడుతూ ‘ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సహజత్వానికి దగ్గరగా కథ నడుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇదివరకు చూడనటువంటి భావోద్వేగభరితమైన సినిమా ఇది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ, జ్ఞానశేఖర్ వి.ఎస్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుజనా రావు.