సేంద్రియ ఎరువులా ఓండ్రు మట్టి
సారవంతంగా సాగు భూములు
దండేపల్లి, జూన్ 21 : చెరువు పూడికతీసిన ఓండ్రు మట్టి సాగు భూములను సారవంతం చేస్తున్నది. నీటి నిల్వ శాతాన్ని పెంచుతూ, సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ప్రాణం పోస్తున్నది. రైతులకు వరంగా మారుతున్నది. మరో వైపు పూడికతీత పనులు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టడంతో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. దండేపల్లి మండలంలోని చెరువుల్లో పూడిక తీసేందుకు అధికారులు పనులు మంజూరు చేశారు. చెరువు పూడిక తీయడం వల్ల చెరువుల్లో వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఉపయోగపడుతున్నది. దీంతో పాటు చెరువుల్లో పేరుకపోయిన చెట్లను తొలగించుకునే అవకాశం ఉంటుంది. పూడిక తీసిన ఓండ్రు మట్ట్టిలో పోషకాలు సమృద్ధిగా ఉండడంతో భూసారం పెరగడంతో పాటు మొక్కలకు కావాల్సిన నత్రజని, పొటాష్, జింక్, మెగ్నీషియం లాంటి సూక్ష్మ పోషకాలు అందుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో రైతుల పొలాలకు మట్టి తరలించేందుకు సన్న, చిన్న కారు రైతులకు ట్రాక్టర్ కిరాయి 5 కిలోమీటర్ల వరకు ట్రిప్పునకు రూ.129 ప్రభుత్వమే చెల్లిస్తున్నది. 5 కిలో మీటర్లు దాటితే ట్రాక్టర్ కిరాయిని రైతులే చెల్లించాల్సి ఉంటుంది. రైతుల భూ ముల్లో పోసిన మట్టిని కూడా ఉపాధి కూలీల చేత నేర్పిస్తున్నది. దీంతో కూలీలకు ప్రతిరోజూ పని దొరుకుతున్నది. ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ రంగ పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మండలంలోని అల్లీపూర్, తాళ్లపేట, లక్ష్మీకాంతాపూర్ చెరువుల్లోని నల్ల మట్టిని రైతులు పొలాలకు తరలించుకుంటున్నారు.
దుబ్బ నేలల్లో పునాస పంటలు వేస్తే నీటి తడి తొందరగా ఆరుతున్నది. ఇలాంటి భూముల్లో చెరువుల్లో పూడిక తీసిన మట్టిని పోసుకుంటే నాలుగు రోజుల వరకు తడి ఆరకుండా ఉంటుం ది. దీంతో మక్క, తదితర ఆరుతడి పంటలకు నీటి తడులు ఆలస్యమైనా చేను ఎండిపోకుండా ఉంటుంది. ఈ మట్టితో భూమికి బలం వస్తది. ఇప్పుడు ఎవుసం పనులు, ఉపాధి పనులకు పోయి చెరువు మట్టిని మా భూమిలోనే పోసుకుంటున్నాం..
-బత్తుల బాపు, రైతు, వెల్గనూర్