దంతాల ఆరోగ్యం అనేసరికి అందరూ ఏ టూత్పేస్ట్ వాడాలి? ఏ కంపెనీ బ్రష్ వాడాలి? అనే ఆలోచిస్తారు తప్ప, ఆహారంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి పట్టించుకోరు. నిజానికి కొన్నిరకాల పండ్లను తరచూ తింటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగని అన్ని పండ్లూ దంతాలకు మేలు చేయకపోవచ్చు. కానీ, ఈ మూడురకాల పండ్లు మాత్రం మంచి ఫలితాలను అందిస్తాయి.
యాపిల్ : ఈ పండ్లు పళ్లను శుభ్రపర్చడంతో పాటు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. యాపిల్లోని ఫైబర్ ఒక టూత్బ్రష్లా దంతాలను శుభ్రపరుస్తుంది. పళ్లపై ఉండే పాచి, పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగిస్తుంది. బ్యాక్టీరియాను వీటిలోని యాసిడ్లు చంపేస్తాయి. అయితే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ను తొక్కతో సహా తినాలి.
కివీ : చాలామంది కివీ పండును కేవలం సిట్రస్ పండుగానే చూస్తారు. కానీ, ఇది బెర్రీ జాతికి చెందిన ఫలం కూడా. ఇందులోని ఫైబర్, క్యాల్షియం పళ్లను పాడుచేసే యాసిడ్స్ను న్యూట్రలైజ్ చేస్తాయి.
స్ట్రాబెర్రీ : పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి ఫైబర్ పుష్కలంగా ఉండే బెర్రీ పండు మంచిది. వీటిలోని విటమిన్-సి చిగుళ్లను దృఢంగా మార్చే కాలోజెన్ అనే ప్రొటీన్ను ఎక్కువ విడుదలయ్యేలా చేస్తుంది. రోజూ 4-6 పండ్లను తీసుకుంటే, ఆరోజుకు సరిపడా విటమిన్-సిలో 70శాతం అందినట్లే. సిట్రస్ పండ్లు తిన్నాక, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మాలి. లేదంటే సిట్రిక్ యాసిడ్ పళ్ల ఎనామిల్ను తగ్గించేస్తుంది.