హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13 కోట్ల పని దినాలను కల్పించనున్నారు. రూ.4,498 కోట్ల విలువైన పనులు జరుగనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా రూ.1,125 కోట్లు భరించనున్నది. రాష్ట్రంలో మొత్తం 53.79 లక్షల జాబ్ కార్డుదారులకు ఉపాధి హామీ కింద పని దొరుకుతుంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రణాళికకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో అవసరమైతే మరో 2 కోట్ల పనిదినాలను మంజూరుచేస్తామని హామీ ఇచ్చింది. ఒక్కో కూలీకి గరిష్ఠంగా రోజుకు రూ.237 చెల్లిస్తారు. 13 కోట్ల పనిదినాలకు కూలీలకు రూ.3,081 కోట్లు చెల్లించనున్నారు. దీనికి అదనంగా 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్, ఆరుశాతం నిర్వహణ వ్యయం కింద రూ.1,417 కోట్లు కానున్నాయి. మొత్తంగా రూ.4,498 కోట్లు అవుతుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వం 25 శాతం కింద రూ.1,125 కోట్లు చెల్లించనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 12 కోట్ల పనిదినాలు మంజూరు చేసింది. అయితే, రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో పెద్దఎత్తున కూలీలకు పని కల్పించడం, మరోవైపు గ్రామాల్లో శాశ్వత పనులు చేపట్టడానికి ప్రాధాన్యమివ్వడంతో 15 కోట్ల దినాలు అవసరమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 12 కోట్లకు అదనంగా మరో 3 కోట్ల పనిదినాలను కేంద్రం ఆమోదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల జరిగిన ఈసీ సమావేశంలో 15 కోట్ల పనిదినాలు మంజూరుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్రావు కోరారు. కానీ, కేంద్రం మాత్రం గతేడాది ముందుగా కేటాయించిన 12 కోట్ల పనిదినాలను మరో కోటి పెంచుతూ 13 కోట్లు మంజూరుచేసింది. అవసరమైతే రెండుకోట్ల పనిదినాలను కూడా మంజూరుచేస్తామని హామీ ఇచ్చింది.
ఈ పనులు చేస్తారు
2021-22లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పల్లెప్రగతి పనులను పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠదామాలు, పల్లెపకృతి వనాలు, సిగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలు, ఎవెన్యూ ప్లాంటేషన్, రైతువేదికలు, రైతు కల్లాలు, డంపింగ్ యార్డులను నిర్మిస్తున్నారు. దీంతో పల్లెల్లో పెద్దఎత్తున శాశ్వత ప్రయోజనాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. వీటిల్లో చాలావరకు పనులు పూర్తి కాగా చివరిదశలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా కొత్తగా నీటి వనరులను సంరక్షించడం, మొక్కల పెంపకం, ఇతర సహజవనరులను సంరక్షించే పనులు చేస్తారు. వీటితోపాటుగా అసంపూర్తిగా ఉన్న రైతుకల్లాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సోక్ పిట్లు, అంగన్వాడీ భవనాలు, ఫీడర్ చానల్స్ నిర్మాణం, భూమిని చదును చేయడం, నర్సరీల్లో మొక్కలు పెంపకం తదితర పనులు చేపడుతారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్