ఐపీఎల్..ఐబీఎల్గా మారిన వైనం
బోర్డులు ఏర్పాటు చేసుకొని ఫుల్గా దందా
మధ్యవర్తులకు లాభం.. యువతకు నష్టం
నడిగడ్డలో జోరుగా బెట్టింగ్
గద్వాల న్యూటౌన్, మే 3: క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ మజాను పంచుతున్నది. దీంతో పాటు బెట్టింగ్ ఊబీలో పడి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఐపీఎల్ (ఇండియన్ ప్రిమియర్ లీగ్ ) కాస్త (ఇండియన్ బెట్టింగ్ లీగ్)గా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ దందా మూడు ఫోర్లు ఆరు సిక్సర్లుగా వర్దిల్లుతున్నది. వేలతో ప్రారంభమై లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. ఇక ఆన్లైన్ల్లోనూ బెట్టింగ్ దందా ఫుల్గా సాగుతున్నది. బెట్టింగ్ పెట్టిన వారంతా నష్టపోతుండగా .. మధ్యవర్తులు బెట్టింగ్ బోర్డులను ఏర్పాటు చేసుకొని రూ.లక్షలు కూడగట్టుకుంటున్నారు. నిషేధిత యాప్ ల్లో సైతం బెట్టింగ్ వినియోగిస్తున్నారు. ఐపీఎల్పై యువతకు ఉన్న ఇష్టాన్ని బెట్టింగ్ సంస్కృతిని కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రెండు వర్గాలతో మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఈ వ్యవహారం గద్వాల, అయిజ, శాంతినగర్, ఇటిక్యాల తదితర ప్రాంతాల్లో బెట్టింగ్ దందా ఫుల్గా కొనసాగుతున్నది. మ్యాచ్ల్లో తలబడుతున్న టీంలను చిన్న, పెద్ద జట్లుగా విభజించి బెట్టింగ్ పెడుతున్నారు. రోజూ ఆట ప్రారంభం లోనే మ్యాచ్ టూ మ్యాచ్ పందెం కాస్తున్నారు. ఏ జట్టు గెలుస్తుందనే దానిపై రూ.వెయ్యి నుంచి రూ.20వేల వరకు పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది.
బంతిబంతికీ బెట్టింగ్
ఐపీఎల్ పోటీలు 20ఓవర్ల మ్యాచ్ కావడంతో బంతి బంతికీ బెట్టింగ్ పెడతారు. లేదంటే మ్యాచ్ గెలుపోటములపై పందెలు కాస్తారు. రూ. 500 నుంచి రూ. 20వేల వరకు బెట్టింగులు నిర్వహిస్తుంటారు. ప్రతి మ్యాచ్లో రూ. లక్షలు చేతులు మారే ఈ వ్యవహారంలో మధ్యవర్తులు కీలకంగా ఉంటారు. గెలిచిన వ్యక్తికి దళారులు పదిశాతం కమిషన్ మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ముట్టజెబుతారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న కొంతమంది అదనంగా కొత్తగా మరికొందరు దళారులుగా మారుతున్నారు. దీంతో యువకులు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి ఉన్నదంతా పొగొట్టుకుంటున్నారు.
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
ఐపీఎల్ బెట్టింగులపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. బెట్టింగ్పై జిల్లాలో ప్రత్యేక నిఘా ఉంచాం. ఎక్కడైనా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. యువత బెట్టింగులకు పాల్పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.