డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలపై ఢిల్లీ సీఎం చేసిన ట్వీట్పై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధమి స్పందించారు. కేజ్రీవాల్కు ఎన్నికల అజెండా ఉండవచ్చు కానీ తాము మాత్రం రాష్ట్ర ప్రజల అభివృద్ధే అజెండాగా ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. తాము ఎన్నికల కోసమే పనిచేయబోమని, తమ ముందు అభివృద్ధి అజెండానే ఉన్నదని స్పష్టం చేశారు. మరోవైపు అంతకుముందు కేజ్రీవాల్ తాను ఆదివారం ఉత్తరాఖండ్ రానున్నట్టు ట్వీట్ చేశారు.
ఉత్తరాఖండ్ విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఖరీదుగానే ఉందని అన్నారు. ఢిల్లీ తన అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి లేక బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నా ఢిల్లీలో ఉచిత విద్యుత్ అందుబాటులో ఉందని ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఉచిత విద్యుత్ పొందలేరా అని కేజ్రీవాల్ వరస ట్వీట్లలో ప్రశ్నించారు. ఇక 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందితే ఉచిత విద్యుత్ ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.