బెంగళూరు: ఒక కుక్క కార్మికుడిపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. దీంతో దాని యజమానురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. యలహంక న్యూ టౌన్లోని అత్తూర్ లేఅవుట్లో నర్సింహా అనే 36 ఏండ్ల కార్మికుడు నిర్మాణ ప్రాంతంలోని మెట్ల కింద పడుకున్నాడు. స్థానికంగా నివాసం ఉండే ఒక మహిళ తన బుల్ డాగ్ కుక్కతో అక్కడికి వెళ్లింది. అయితే నిద్ర పోతున్న నర్సింహాపై ఆ కుక్క దాడి చేసింది. అతడి మెడపై రక్కి కరిచింది. కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నించిన యజమానురాలు కూడా స్వల్పంగా గాయపడింది.
మరోవైపు అరుపులు విన్న స్థానికులు వచ్చి చూడగా రక్తం బాగా కారి కార్మికుడు నర్సింహా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికుడి మరణానికి కారణమైన కుక్క యజమానురాలిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.