హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలోని గొల్ల కురుమలకు రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లతో మరో మూడు లక్షల యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మాంసోత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ది సాధించేందుకు, గొల్ల కురుమల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు రూ. 4,854 కోట్లతో 77 లక్షల 2 వేల 737 గొర్రెలను, 3 లక్షల 66 వేల 797 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ గొర్రెలకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా అదనంగా కోటి 20 లక్షల గొర్రె పిల్లలు పునరుత్పత్తి అయ్యాయని తెలిపారు. దీంతో గొల్ల కురుమలకు రూ. 5,400 కోట్ల విలువ చేసే సంపద సమకూరిందన్నారు.
నీరా పాలసీ
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నీరా పాలసీని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. దీని కోసం బడ్జెట్లో రూ. 25 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందిస్తుందన్నారు.