జకార్తా: కోవిడ్ వచ్చాక గందరగోళం సంశయం పెరిగిపోయాయి. ముందు రోగం గురించి.. తర్వాత దాని చికిత్స గురించి.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి. పనితీరుపై రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమమనే నిర్ధారణకు ప్రపంచం వచ్చినట్టే కనిపిస్తున్నది. అయితే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలని మళ్లీ సందేహాలు. కోవాక్సిన్ వేసుకోవాలా.. కోవిషీల్డ్ వేసుకోవాలా.. వ్యాక్సినేషన్ లో శరవేగంగా దూసుకుపోతున్న అమెరికాలోనే ఫిజర్, మోడర్నాతోపాటుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు వాడుతున్నారు. మొదటి రెండు టీకాలు రెండు డోసులు వేయాల్సిందే. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ ఒకే డోసుతో పనిచేస్తుందని అంటున్నారు. అమెరికా ప్రభుత్వ ఆర్డరుతో ఉత్పత్తి పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇకపోతే క్లినికల్ ట్రయల్స్ లో ఘోరంగా విఫలమైందని చెప్తున్న చైనా వ్యాక్సిన్ ఇప్పుడు వార్తలకెక్కింది. సైనోవాక్ కంపెనీ తయారు చేసే టీకాకు కరోనావాక్ అని పేరుపెట్టారు. ఇండొనీషియాలో దీని వాడకంపై జరిగిన అధ్యయనాల్లో ఉత్తమ పలితాలు వచ్చాయని స్వయంగా ఆ దేశ ఆరోగ్యమంత్రి బుడిగునాది సదికిన్ వెల్లడించారు. 25,374 మంది ఆరోగ్య కార్యకర్తలను 28 రోజుల పాటు పరిశీలించారు. మరణావకాశం 100 శాతం తగ్గిందని, ఆస్పత్రిలో చేరాల్సిన ఆవశ్యకత 96 శాతం తగ్గిందని ఇండొనీషియా మంత్రి చెప్పారు. చైనా వ్యాక్సిన్ మీద ఆధారపడిన అనేక పేదదేశాలకు ఇది శుభవార్తే అని చెప్పాలి. 94 శాతం మందికి కరోన సోకనేలేదని అంటున్నారు. ఇండొనేషియా అద్యయనంపై పూర్తి వివరాలు వచ్చేంత వరకు ఏమీ చెప్పలేమని సైనోవాక్ కంపెనీ ప్రతినిధి అన్నారు. కాగా ఆ కంపెనీ సీఈవో యిన్ వెయిడాంగ్ మాత్రం ప్రయోగదశ ఫలితాలకూ, తదనంతర వాస్తవ వినియోగ ఫలితాలకూ మధ్య తేడా ఉండొచ్చని అన్నారు. దేశదేశాల్లో కరోనా వైరస్ రకాన్ని బట్టి ఫలితాల్లో తేడాలు ఉండొచ్చని తెలిపారు.