లక్నో : భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య ఎలాగైనా అతన్ని పోలీసులకు పట్టించాలనుకుంది. కానీ విధి బాగా లేక ఆమెనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ఎస్జీఎం నగర్లో ఓ ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్ కాగా, భార్య గృహిణి. అయితే భర్త విధులు ముగించుకున్న తర్వాత ఇంటికి ఆలస్యంగా రావడం, ఒక్కొక్క రోజు ఇంటికే రాకపోవడంతో అతనిపై భార్య అనుమానం పెంచుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. ఎలాగైనా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భార్య కంకణం కట్టుకుంది.
దీంతో ఢిల్లీకి చెందిన పవన్ అనే వ్యక్తితో 700 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి.. భర్తలో ఆటోలో దాచి పెట్టింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు తనిఖీ చేయగా ఆటోలో గంజాయి లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తను అరెస్టు చేయించాలనుకున్న ఆమెకు పోలీసులు షాక్ ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా ఆమెను సుదీర్ఘంగా విచారించడంతో.. తానే గంజాయి ఆటోలో ఉంచినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులకు ఆమె అడ్డంగా దొరికి కటకటాల పాలైంది. ఆమెతో పాటు పవన్ను పోలీసులు అరెస్టు చేశారు.