వరంగల్ చౌరస్తా, మే 24 : ఎంజీఎం దవాఖానలో నిర్లక్ష్యానికి తావు లేకుండా, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయంలో వివిధ విభాగాధిపతులు, ఎంహెచ్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ వార్డుతో పాటు ఎంజీఎం ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇందుకోసం చాలాకాలంగా విధులకు హాజరు కాని పారిశుధ్య సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు షిఫ్టులు విధులు నిర్వర్తిస్తున్న వారు ప్రతి షిఫ్టు టైమ్లో బయోమెట్రిక్ పద్ధతి ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఎంజీఎంలో శానిటేషన్ కార్మికులు సేకరించిన చెత్తను అక్కడి నుంచి రోజుకు రెండుసార్లు తరలించాలని ఎంహెచ్వోను ఆదేశించారు. దవాఖాన ఆవరణలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి, గ్రీనరీని పెంచడానికి డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ వార్డు లో షిప్టు వారీగా వైద్యులకు బాధ్యతలు అప్పగించాలని, వారు నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొవిడ్ వార్డుకు అందుతున్న ఆక్సిజన్, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవరోధాలు లేకుండా చూడాలని, నిరంతర పర్యవేక్షణకు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ ఎంహెచ్వో రాజారెడ్డి పాల్గొన్నారు.