హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీనువైట్ల కలయికలో రూపొందిన ‘ఢీ’ చిత్రం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని అలరించింది. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నది. ‘ఢీ అండ్ ఢీ’(డబుల్ డోస్) పేరుతో దర్శకుడు శ్రీనువైట్ల ఈ సీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు జోడీగా నటించబోయే నాయిక కోసం చిత్రబృందం చాలా రోజులుగా అన్వేషణ సాగిస్తోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆ అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. తొలి సినిమాలో సహజ నటనతో ఆకట్టుకున్న ఈ హైదరాబాదీ సొగసరిని చిత్రబృందం సంప్రదించినట్లు తెలిసింది. వినోదాత్మక పంథాలో తన పాత్రను దర్శకుడు మలచిన తీరు నచ్చడంతో ఆమె ఈ సినిమాను అంగీకరించినట్లు చెబుతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది.