నర్సంపేట, మే 21 : ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నర్సంపేటలో దవాఖానలో 32 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారు మెడికల్ కిట్లు తీసుకుని హోంఐసొలేషన్లో ఉండాలని కోరారు. మరోవైపు 23 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వార్డులో13 మంది చికిత్స పొందుతున్నారని, ఒకరు మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనాకు సంబంధించి నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో 20 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. దీనిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల సూచనలు పాటించాలని, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట మండల కేంద్రంలోని పీహెచ్సీలో 45 మందికి శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వీరిలో 12 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రణధీర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనాపై నిర్లక్ష్యం చేయొద్దని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు.
గీసుకొండలో..
గీసుగొండ : గీసుగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ద గ్గు, జలుబు, జ్వరంతో వచ్చే వారికి పరీక్షలు చేస్తున్నట్లు సీహెచ్వో మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం 25 మందికి కరోనా పరీక్షలు చేయగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్ద సౌకర్యాలు లేకుంటే వంచనగిరి మోడల్ స్కూల్లోని ఐ సొలేషన్ కేంద్రానికి వెళ్లాలని ఆయన సూచించారు.
శాయంపేటలో..
శాయంపేట : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 27 మందికి కరోనా పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నాగశశికాంత్ వెల్లడించారు. వీరిలో శాయంపేటలో ఏడు, పత్తిపాకలో రెండు, వసంతాపూర్, మైలారంలో ఒకరి చొప్పున పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వీరికి ఐసొలేషన్ కిట్లను అందించి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేశ్వరవర్మ పాల్గొన్నారు.