బాచారం, బండరావిరాల, గౌరెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అబ్దుల్లాపూర్మెట్, మే 9 : దళారీలను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ దాస్గౌడ్ అన్నారు. కొవిడ్ను నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం, బండరావిరాల, గౌరెల్లి గ్రామాల్లో ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించి ఆదుకుంటున్నదన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుబీమా, రైతుబంధు, 24 గంటల విద్యుత్ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుల సమస్యలు, నూతన వ్యవసాయ పద్ధతులపై చర్చించుకునేందుకు రైతు వేదికలను నిర్మించిందన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 1,888, సాధారణ గ్రేడ్ రూ.1,868 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు భౌతిక దూరాన్ని పాటించి మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్రెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకారం సంఘం చైర్మన్ విఠల్రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరక్టర్ కొత్త కిషన్గౌడ్, సర్పంచ్లు సంతోష, శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్, ఎంపీటీసీలు బాలలింగస్వామి, అనితామహేందర్గౌడ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.