వచ్చే నెలలో అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలుస్తాం
డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం
రాబోయే రెండు మూడేళ్లలో పూర్తయ్యేలా చూస్తాం
ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తాం
బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట
విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
తెలంగాణచౌక్లో సీఎం భారీ కటౌట్కు పాలాభిషేకం
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మానేరు రివర్ఫ్రంట్ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తుందని, ఈ పనుల కోసం తాజా బడ్జెట్లో 100 కోట్ల కేటాయించడంతో తొలి అడుగు పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్, థీమ్పార్కులు, లైటింగ్, కమ్యూనిటీ హాల్స్, బోటింగ్, ప్లోటింగ్, రెస్టారెంట్లు, సూట్లు, రెస్టు రూంలు వంటివి ఎక్కడ ఎలా నిర్మించాలో డీపీఆర్ తయారు చేయడానికి వచ్చే నెలలో అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్వేత హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలకు సీఎం పెద్దపీట వేశారని, గతంలో ఎప్పుడూ లేనన్ని నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మానేరు రివర్ఫ్రంట్ నిర్మాణానికి 100 కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రికి కరీంనగర్ అభివృద్ధిపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ఇప్పటికే మానేరు రివర్ఫ్రంట్లో భాగంగా 80 కోట్లతో ఐదు ప్రాంతాల్లో చెక్డ్యాంలు నిర్మిస్తున్నామని, అలాగే కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మానేరు డ్యాం గేట్ల నుంచి పది కిలోమీటర్ల మేర దుర్శేడ్ వరకు మానేరు రివర్ఫ్రంట్ ఉంటుందన్నారు. మొదట డ్యాం నుంచి దిగువన 3.7 కిలోమీటర్ల దూరంలో ఒక చెక్డ్యాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిధిలో కేబుల్ బ్రిడ్జితో పాటు.. ప్రస్తుత బ్రిడ్జి ఉంటుందన్నారు. తాజాగా కేటాయించిన వంద కోట్లతో మానేరు రివర్ఫ్రంట్ నిర్మాణాలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. 12 ఫీట్లలోతుతో నీరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాజరాజేశ్వర, లోయర్ మానేరు జలాశయాలు 365 రోజులు నీటితో కళకళలాడుతాయని పేర్కొన్నారు. తద్వారా పర్యాటక ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా యాత్రికులను ఆకట్టుకుంటుందన్నారు. సబర్మతి తరహాలో రివర్ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. 24 టీఎంసీలతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఏ పట్టణం, నగరానికి కూడా జలాశయం ఆనుకొని లేదని, అది ఒక కరీంనగర్కు మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తిస్థాయిలో రివర్ఫ్రంట్ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇది పూర్తయితే కరీంనగర్ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని చెప్పారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. రివర్ఫ్రంట్తో కరీంనగర్ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. అలాగే, స్వరాష్ట్రం సాధించిన తదుపరి జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్రం రాకముందు.. వచ్చిన తదుపరి ఒక్కసారి అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాయకులు చల్లా హరిశంకర్, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం కటౌట్కు పాలాభిషేకం
కార్పొరేషన్, మార్చి 19: మానేరు రివర్ ఫ్రంట్కు 100 కోట్లు కేటాయించిన సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్కు మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య, మాజీ మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, తోట రాములు, రమణారావు, గందె మాధవి, నాంపెల్లి శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, కంసాల శ్రీనివాస్, నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్గౌడ్, సంపత్రావు, జమీలొద్దీన్, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.