అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
ఆటోను ఢీ కొట్టిన లారీ : ఇద్దరు మహిళలు మృతి
మరో ఆరుగురికి గాయాలు
ఓ మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన లారీ
పద్మాజివాడి ఎక్స్రోడ్ వద్ద ప్రమాదం..
సదాశివనగర్, జూన్,13 : బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్రోడ్డపై ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి సదాశివనగర్ ఎస్సై శేఖర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలంలోని సంగోజివాడి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (28), గడ్డం మమత (30) మరికొంత మంది బంధువులతో కలిసి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో బంధువు అంత్యక్రియల కోసం ఆదివారం ఉదయం ఆటోలో వెళ్లి తిరుగు పయనమయ్యారు. ఆటో సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్ రోడ్డు జాతీయ రహదారి వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొన్నది.
దీంతో ఆటోల ఉన్న గడ్డం మమత లారీ ముందు టైరు కింద పడి అక్కడికి అక్కడే మృతి చెందింది. మరో మహిళ గడ్డం లక్ష్మి లారీకి ఇరుక్కుపోవడంతో కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. సదాశివనగర్ మోడల్ స్కూల్ వద్ద లక్ష్మి రోడ్డుపై పడి మృత్యువాత పడింది. ఆటోలో ఉన్న సాయిలు, భూపతి, మమత భర్త ఆటో డ్రైవర్ గడ్డం చిన్నబాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానను తరలించారు. గడ్డం రాజయ్య, గడ్డం సాయవ్వ, రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి నల్గొండ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం చోటు చేసుకున్నదని బాధితులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.