రానా, కెల్విన్ను కలిపి ప్రశ్నించిన అధికారులు
నేడు విచారణకు హాజరుకానున్న హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. బుధవారం నాటి విచారణకు హీరో దగ్గుబాటి రానా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్ సరఫరా దారుడు కెల్విన్తో సంబంధాలు, ఎఫ్ క్లబ్లో పార్టీలు, అక్కడ పార్టీలు జరుపుకొనే తీరు, ఎవరెవరు పార్టీలకు హాజరయ్యేవారు?..కెల్విన్కు ఎప్పుడైనా డబ్బులు పంపారా?..ఇలా రానాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈడీ అధికారులు సమన్లలో పేర్కొన్న ప్రకారం తన రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను రానా సమర్పించినట్టు తెలిసింది. అందులోని పలు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. కెల్విన్ గురించి ఆరా తీయగా తనకు తెలియదని రానా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈడీ అధికారులు రానా, కెల్విన్ను కలిపి కూర్చొబెట్టి కొన్ని అంశాలపై ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రధానంగా ఎఫ్ క్లబ్లో పార్టీపైనే ఆరా తీసిన ఈడీ అధికారులు, పార్టీలు జరిగిన రోజుల తర్వాత రానా బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు, కెల్విన్ ఖాతాల వివరాలు సరిచూసినట్టు సమాచారం. ఇలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని రానా నుంచి సేకరించినట్టు తెలిసింది. రానా సైతం ఈడీ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారని తెలిసింది. దాదాపు ఏడు గంటల విచారణలో తొలుత బ్యాంకు లావాదేవీల వివరాలు, తర్వాత ఎఫ్ క్లబ్ సహా ఇతర వీకెండ్స్లో పార్టీలు, ఆ పార్టీల్లో ఎవరెవరు పాల్గొంటారు అన్న విషయాలపైనా ఈడీ లోతుగా ఆరా తీసినట్టు తెలిసింది.
ప్రతి విచారణకు కెల్విన్..?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న కెల్విన్ను ఈడీ అధికారులు ప్రతి సారి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. డ్రగ్స్ సరఫరాతోపాటు పలువురు సినీ ప్రముఖులతో కెల్విన్కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి కెల్విన్కు డబ్బులు వచ్చాయని, వాటిని తిరిగి అంతర్జాతీయ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు, ఈ డ్రగ్స్ కొనుగోళ్లలో మనీలాండరింగ్ జరిగిందన్న దానిపై ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంగళవారం నాటి సోదాల్లో స్వాధీనం చేసుకున్న కెల్విన్ ల్యాప్టాప్ను సైతం ఈడీ అధికారులు బుధవారం ఓపెన్ చేయించినట్టు తెలిసింది. దాదాపు ఐదు గంటలకు పైగా బుధవారం ఈడీ అధికారులు కెల్విన్ను ప్రశ్నించారు. దీనిలో అతడి నుంచి కీలక విషయాలను సేకరించినట్టు సమాచారం. అదేవిధంగా కెల్విన్ ల్యాప్టాప్లోని పలు ఫొటోలు, ఇతర వివరాలు, కొన్ని డాక్యుమెంట్లను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ప్రతి ఒక్కరి విచారణలో కెల్విన్ను కూడా ఉంచి ప్రశ్నించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగా విచారించిన దర్శకుడు పూరీజగన్నాథ్, నటి చార్మి, రకుల్ప్రీత్సింగ్లు కెల్విన్కు సంబంధించిన వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో ఈడీ అధికారులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్టు సమాచారం. మంగళవారం నందు విచారణలోనూ ఈడీ అధికారులు కొద్దిసేపు కెల్విన్ను కూడా పక్కన కూర్చోబెట్టి ప్రశ్నించారు. అదే తరహాలో రానా విచారణలోనూ కొన్ని ప్రశ్నలు కలిపి వేసినట్టు సమాచారం. కాగా, గురువారం నాటి విచారణకు హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్లు హాజరుకానున్నారు. తొలుత విచారించిన ఐదుగురి నుంచి సేకరించిన అంశాలు, కెల్విన్ ల్యాప్టాప్ నుంచి సేకరించిన విషయాల ఆధారంగా హీరో రవితేజను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.