మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరానికి పడమర దిక్కున నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు కొని నగరం మీదుగా తూర్పుదిక్కున గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు ఉన్న మూసీపై 12 చోట్ల నూతన బ్రిడ్జీలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.350 కోట్లు వెచ్చించనున్నారు..
రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మూసీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ పనులు ప్రారంభం కాగా.. భవిష్యత్తులో మూసీ పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగర వాసులు సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా కొత్తగా మూసీపై బ్రిడ్జీలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రాథమికంగా అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు 12 నుంచి 13 బ్రిడ్జీలు నిర్మించాలని గుర్తించారు. దీనికి మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు మూసీపై కొత్తగా నిర్మించే 12 బ్రిడీల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.350 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు ఉన్న సుమారు 52 కి.మీ మూసీ నదిపై 13 బ్రిడ్జీలు ఉన్నాయి. అయితే అవి చాలా దూరంలో ఉన్నాయి. వాటి మధ్యలో కొత్తగా బ్రిడ్జీలను నిర్మిస్తే ఒకవైపు నుంచి మరోవైపు రాకపోకలు సాగించేందుకు ఎంతో సులభంగా మారుతుంది. ముఖ్యంగా లంగర్హౌజ్, పురానాపూల్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, నాగోల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జీలపై ట్రాఫిక్ రద్దీ అధికంగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే.. మూసీకి ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లాలంటే 4-5 కి.మీ దూరం ప్రయాణం చేసి.. అక్కడున్న బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీనికి బదులుగా ప్రతి 2-3 కి.మీ.లకు ఒక బ్రిడ్జి నిర్మిస్తూ, దానికి అనుసంధానంగా రోడ్లను నిర్మిస్తే ఇప్పటికే ఉన్న రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గనున్నది. దీనికితోడు మూసీ సుందరీకరణ చేపడితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మూసీలోకి మురుగునీరు కాకుండా స్వచ్ఛమైన నీరు పారేలా ఏర్పాట్లు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూసీ తీరం కబ్జాలకు గురికాకుండా చేయడంతో పాటు కొత్తగా రోడ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లను సైతం మూసీ నది తీరం అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) క్షేత్ర స్థాయిలో మూసీ సుందరీకరణ పనులు మొదలు పెట్టినా, బడ్జెట్ సమస్య ఉంది. ఈనేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను సైతం మూసీ నది తీరం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత సంస్థలను ఆదేశించారు. నిధుల కొరత లేకుండా, పనులు వేగంగా జరిగేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో అవసరమని, అందరూ కలిసి పనిచేయాలని సూచించిన నేపథ్యంలోనే కొత్తగా 12 బ్రిడ్జీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రతిపాదలు రూపొందిస్తున్నాయి. మరో 3-4 నెలల్లో వీటి నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లను సిద్ధం చేసి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.