శ్రీశైలం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి శాశ్వతంగా తొలగిపోవాలని కాంక్షిస్తూ శ్రీశైల క్షేత్రంలో రేపటి నుంచి మహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రారంభిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జూన్ 25 (40 రోజులపాటు) ఆలయంలో అర్చక వేదపండితులు ఏకాంతంగా మృత్యుంజయ మంత్ర పునఃశ్చరణ, హోమాలు, జపానుష్టాన పూజలు చేయించనున్నట్లు ఆయన తెలిపారు.
మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో ఈ హోమం చేయడం వల్ల ప్రజలందరికీ అకాల మృత్యుదోష నివారణ కలుగుతుందని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జరిగే హోమాన్ని శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులు వీక్షించవచ్చని పేర్కొన్నారు.
ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఆదివారం శ్రీశైలం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి మహాగ్రంథాన్ని రచించిన పాలధార పంచదార వద్ద శారదాదేవి, శంకరాచార్యుల విగ్రహాలకు పంచామృతాలు, శుద్ధ గంగాజలంతో విశేష అభిషేకాలు, పుష్పార్చన చేయనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా క్షేత్ర పరిధిలోని రుద్రవనంలో శంకర జయంతి రోజున ప్రతిష్ఠించిన 14 అడుగుల రుద్రమూర్తికి విశేష అభిషేకాలు చేయనున్నారు. రుద్రదేవుని చల్లనిచూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలనే ఉద్దేశంతో నదికి అభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు అర్చకులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.