హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడక ముందు పేదలు దుర్భర పరిస్థితులు అనుభవించారు అని బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శాసనసభలో సంక్షేమ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడారు. రూ. 40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది అని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, మలేరియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నామని తెలిపారు. 39,36,525 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి.
దళిత వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను ఆ ఏడాది ఖర్చు పెట్టకపోతే.. వాటిని మరో సంవత్సరానికి బదలాయించే చట్టం తీసుకోచ్చామన్నారు. గురుకులాల నిర్వహణకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి ప్రభుత్వం పర్యవేక్షిస్తుందన్నారు. గురుకులాల్లో కల్పిస్తున్న విద్య, సౌకర్యాలు.. ఏ కార్పొరేట్ కాలేజీల్లోనూ లేవు అని స్పష్టం చేశారు. 2014కు ముందు 134 గురుకులాలు ఉంటే.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత అదనంగా 268 గురుకులాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నీట్, ఐఐటీలో సీట్లు సాధించారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.