శాన్ఫ్రాన్సిస్కో: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీల్లో చాలా వరకు ఏడాదిగా తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలుసు కదా. వీళ్లలో కొన్ని కంపెనీలు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కూడా కల్పించాయి. మరికొన్ని ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. తాజాగా గూగుల్ హైబ్రిడ్ వర్క్ వీక్ను ప్రవేశపెడుతున్నట్లు ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు మెయిల్ పంపించారు. ఇప్పటికే సంస్థలో 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయనున్నారు.
మరో 60 శాతం మంది ఉద్యోగులను మాత్రం ఈ హైబ్రిడ్ వర్క్ వీక్లోకి మూవ్ చేస్తున్నారు. దీని ప్రకారం ఈ ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలి. మిగతా రెండు రోజులు ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశం ఉంటుందని పిచాయ్ చెప్పారు. ఈ ఏడాది చివర్లో గూగుల్ తమ ఆఫీసులను తెరిచే ప్రయత్నం చేస్తోంది. ఆఫీసులు తెరిచిన తర్వాత కూడా 20 శాతం మందికి మాత్రం ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్లలో ఎక్కడైనా పనిచేసే అవకాశం కల్పించేలా గూగుల్ చర్యలు చేపడుతోంది. ఇక టీమ్ అవసరాలు, రోల్ను బట్టి పూర్తిగా ఇంటి నుంచే పని చేసే వీలు కూడా కల్పించే అవకాశాలు ఉంటాయి. ఏడాదికి నాలుగు వారాలు ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.