న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ‘ఎన్టీపీసీ’ ( NTPC ) వచ్చే పదేండ్లలో అతిపెద్ద సోలార్ పార్క్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నది. గుజరాత్లోని కచ్లో 4,750 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పార్క్ నిర్మించనున్నది.
ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ అనుబంధన ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్టీపీసీ ఆర్ఈఎల్) చేపట్టనున్నది. అందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) అనుమతి ఇచ్చింది.
ఇటీవల కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ కూడా రాబోయే రోజుల్లో సంప్రదాయేతర ఇంధన రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది. ఈ రెండు కంపెనీలతోపాటు ఆదానీ గ్రూప్ కూడా గుజరాత్లో శరవేగంగా తన సోలార్ ప్లాంట్ను విస్తరించనున్నది.
రిలయన్స్ మాదిరిగానే ఎన్టీపీసీ సైతం సోలార్ ప్లాంట్లో గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గత ఐదేండ్లుగా ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నది.
ప్రస్తుతం సౌర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఎన్టీపీసీ మొత్తం 6,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. 2032 నాటికి 60 వేల మెగావాట్ల విద్యుత్ తయారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మెజారిటీ సౌర విద్యుత్ ప్లాంట్లు గుజరాత్లోనే ఉంటాయి.
ఎన్టీపీసీ ప్రస్తుతం చేపట్టిన 1,800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రగతిలో ఉంది. సౌర విద్యుత్ తయారు చేయడానికి పెట్టుబడులు ఎలా సేకరిస్తుందన్న సంగతిని ప్రకటించలేదు.
సోలార్ ప్లాంట్ ద్వారా మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.4 కోట్లు ఖర్చవుతుంది. దీని ప్రకారం తన లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఎన్టీపీసీకి రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్లు పెట్టుబడులు కావాలి.