న్యూఢిల్లీ: ఓ భారీ మోసం కేసులో మరో బాలీవుడ్ నటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఫోర్టిస్ హెల్త్కేర్ ప్రమోటర్ శివేందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో నటి నోరా ఫతేహికి ఈ సమన్లు జారీ అయ్యాయి. సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్లపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు పంపించింది. గతంలోనూ ఇదే కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను కూడా ఈడీ 5 గంటల పాటు ప్రశ్నించింది.
ఇప్పుడు ఈ ఇద్దరితో నోరాకు ఉన్న లింకులేంటి అన్న విషయం తెలుసుకునేందుకు ఆమెను ప్రశ్నించడానికి ఈడీ సిద్ధమవుతోంది. శివేందర్ సింగ్ జైల్లో ఉన్న సమయంలో ఆయనను బెయిల్పై బయటకు తీసుకొస్తామని చెబుతూ తనను తాను న్యాయశాఖ అధికారిగా చెప్పుకొని శివేందర్ భార్య అదితి సింగ్ను చంద్రశేఖర్ కలిశాడు. ఆమె నుంచి రూ.200 కోట్ల వరకూ వసూలు చేశాడు. ఈ డబ్బంతా బీజేపీ పార్టీ ఫండ్కు వెళ్తోందని, హోంమంత్రి అమిత్ షా కూడా మీతోనే ఉన్నారని చెబుతూ శివేందర్ కుటుంబానికి టోకరా వేశాడు.
ఈ కేసులో చంద్రశేఖర్ భార్య లీనా పాల్ పేరు కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరిపై నేరపూరిత కుట్ర, మోసం, దోపిడీ కేసులు నమోదయ్యాయి. వీళ్లతో నోరా ఫతేహికి ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగానే ఆమెకు సమన్లు జారీ చేసింది.