టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. మంగళవారం ఉదయం నటుడు నందు ఈడీ విచారణకు హాజరుకావడం..మధ్యాహ్నానానికి ఈడీ అధికారులు కెల్విన్ను భారీ భద్రత నడుమ ఈడీ కార్యాలయానికి తరలించడం..ఇద్దరిని కలిసి విచారించడం వంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఈనెల 20 ఈడీ ఎదుట హాజరు కావాలని నటుడు నందుకు అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ఇన్ని రోజులు ముందస్తుగా నందు ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారులు ముందుగా రమ్మని పిలిచారా? లేదా వ్యక్తిగత కారణాలతో హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ మాదిరిగానే తాను కూడా ముందస్తుగా ఈడీ విచారణకు హాజరయ్యాడా అన్నది స్పష్టం కాలేదు. ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చిన నటుడు నందు నుంచి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు, పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ప్రధానంగా బ్యాంక్ లావాదేవీలు, ఇతరులకు ఎవరెవరికి డబ్బులు పంపారు. డ్రగ్స్సరఫరా దారుడు కెల్విన్తో పరిచయాలు, అతడి ఖాతాకు ఏమైనా డబ్బులు పంపారా? అన్న కోణంలో ఈడీ సమాచారం సేకరించింది. కాగా విచారణ అనంతరం నందు మీడియా కంట పడకుండా వెనుక గేటు ద్వారా బయటికి వచ్చి..అప్పటికే దూరంగా పార్క్ చేసి ఉన్న తన కారులో ఎక్కి వెళ్లినట్టు సమాచారం.
కెల్విన్ ఇంట్లో ఈడీ సోదాలు..
టాలీవుడ్ తారలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రధానంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు కెల్విన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం బోయిన్పల్లిలోని కెల్విన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో కెల్విన్కు చెందిన ల్యాప్టాప్, పలు పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మధ్యాహ్నం సమయంలో సీఆర్పీఎఫ్ భద్రత నడుమ కెల్విన్ను ఈడీ అధికారులు నాంపల్లిలోని ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. కెల్విన్తోపాటు అతడి స్నేహితులుగా ఉన్న అబ్దుల్ వాహీద్, అబ్దుల్ కుదూస్లను సైతం మెహదీపట్నం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. అయితే ఈ ఇద్దరినీ తీసుకువచ్చిన విషయాన్ని ఈడీ వర్గాలు ధ్రువీకరించలేదు. కాగా, మధ్యాహ్నం నుంచి ఈడీ కార్యాలయంలో కెల్విన్ను ప్రశ్నిస్తున్న అధికారులు పలు బ్యాంక్ లావాదేవీలపై సమాచారం సేకరించినట్టు తెలిసింది. అంతర్జాతీయంగా జరిపిన లావాదేవీలపైనా మరింత ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈడీ విచారణలో భాగంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మి , రకుల్ప్రీత్సింగ్ల నుంచి సమాచారం సేకరించిన ఈడీ అధికారులు వారిచ్చిన స్టేట్మెంట్లలోని కీలకాంశాలను సైతం కెల్విన్ను అడిగి మళ్లీ ధ్రువీకరించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కెల్విన్ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సినీ ప్రముఖులతో సంబంధాలపై మరోమారు ఆరా తీసినట్టు తెలిసింది. నందును, కెల్విన్ను సైతం కలిపి ఒకేచోట కూర్చోబెట్టి కూడా ప్రశ్నించినట్టు సమాచారం. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం కెల్విన్ను వదిలిన ఈడీ అధికారులు, మళ్లీ ఎప్పుడు అవసరం ఉన్నా విచారణకు హాజరుకావాలని సూచించినట్టు తెలిసింది. కెల్విన్తోపాటు అబ్దుల్ వాహీద్, అబ్దుల్ కుదూస్లను సైతం విచారణ అనంతరం ఈడీ అధికారులు పంపించారు. కాగా, బుధవారం ఈడీ విచారణకు హీరో రానా హాజరుకావాల్సి ఉంది. గురువారం హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు ఈడీ అధికారులు కెల్విన్ను కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించడం మరింత ఆసక్తికరంగా మారింది.