హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి సినీహీరో తరుణ్ బుధవారం ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కెల్విన్ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు మొత్తం 12 మందికి సమన్లు జారీ చేశారు. చివరగా హీరో తరుణ్ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకురావాలని సూచించారు. కెల్విన్తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైనా ఆరా తీయనున్నట్టు తెలిసింది. అయితే తరుణ్తో ఈడీ అధికారుల విచారణ ముగుస్తుందా..విచారణకు హాజరైన వారంతా ఇచ్చిన సమాచారంతో మరేమైనా కొత్త లింకులు బయటికి వస్తాయా?..ఇంకెవరికైనా ఈడీ సమన్లు పంపనుందా?..అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.